వరంగల్: ప్రమాదవశాత్తు ఇంటి స్లాబ్పై నుంచి జారిపడి ఒకరు మృతి చెందిన ఘటన నర్సంపేటలోని కమ్మరికుంట కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన మాదాసి కృష్ణ(43) కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజు మాదిరిగా సోమవారం సాయంత్రం స్లాబుపై నిద్రించాడు. రాత్రివేళ దిగే క్రమంలో కింద పడటంతో కుటుంబసభ్యులు వెంటనే స్థానిక జిల్లా జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.
Author: Shivaganesh
-
ఇసుక ట్రాక్టర్ సీజ్.. కేసు నమోదు
వరంగల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను మంగళవారం మామునూరు పోలీసులు సీజ్ చేశారు. వర్ధన్నపేట ఆకేరు వాగు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి మీదుగా నగరానికి తరలిస్తుండగా ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ను పట్టుకొని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
-
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
వరంగల్: ఈఎస్ఐఐ విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో బుధవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అబ్బనికుంట, యాకూబుర, టీఆర్టీ కాలనీ, ఎస్ఆర్టీ కాలనీ, జాన్పీరీలు, 100 ఫీట్ల రోడ్డు, అల్పాహారం, నర్సంపేట ప్రధాన రహదారి ఏరియాల్లో అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులు గమనించి విద్యుత్తు సిబ్బందికి సహకరించాలన్నారు.
-
‘ర్యాలీని విజయవంతం చేయాలి’
మెదక్: ఈనెల 17న జిల్లాలో నిర్వహించనున్న ర్యాలీ, బహిరంగ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ సభ్యుడు చౌదరి సుప్రభాతరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన రామాయంపేటలో మీడియాతో మాట్లాడారు. ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ మోహన్ నాయక్తో పాటు పలువురు కాంగ్రెస్లో చేరుతున్న సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనే ర్యాలీకి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.
-
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9, 10వ తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని బీసీ అభివృద్ధి అధికారి జి. జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ-పాస్ వెబ్సైట్లో 2024-25 విద్యా సంవత్సరంలో చదివినవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు, ధ్రువపత్రాల నకలు ప్రతులను కలెక్టరేట్లోని బీసీ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
-
మైనార్టీ గురుకుల పోస్టులకు దరఖాస్తులు
ఖమ్మం: జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఖాళీలలను పొరుగు సేవల విధానంలో భర్తీ చేయనున్నట్లు ప్రాంతీయ సమన్వయకర్త ఎం.జి.అరుణకుమారి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి పురందర్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 నుంచి 18లోగా జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్ (మహిళ) ఒకటి, పీజీటీ బయో సైన్స్ (మహిళ) ఒక పోస్టుకు ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
-
దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్: 20:25-26 విద్యా సంవత్సరానికి ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల కోసం ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో తొమ్మిది, పదో తరగతి చదువుతున్న బీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పుష్పలత ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఈ-పాస్ వెబ్సైట్లో అన్ని ధ్రువపత్రాలతో ఆన్లైన్ చేసిన దరఖాస్తులను హన్మకొండలోని జిల్లా బీసీఅభివృద్ధి కార్యాలయంలో సమర్పించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
-
దోమల నివారణకు ప్రత్యేక చర్యలు
మెదక్: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో మంగళవారం మున్సిపల్ అధికారులు దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విష జ్వరాలు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ సిబ్బంది దోమల మందు పాగింగ్ చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, దోమల మందు స్ప్రే చేయడంతో పాటు ఆయిల్ బాల్స్ వేసినట్లు సిబ్బంది తెలిపారు.
-
బాధ్యతలు స్వీకరించిన దేవకుమార్
మెదక్: జిల్లా వ్యవసాయ అధికారిగా కె.దేవకుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా పనిచేసి బదిలీపై జిల్లాకు వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన రైతు భరోసా, రైతు బీమా, సీఎం కిషన్, పంటల నమోదు, రుణమాఫీ, విత్తనాలు, ఎరువుల సరఫరాలపై దృష్టి సారిస్తామన్నారు. ఈసందర్భంగా ఆయనను సిబ్బంది సన్మానించారు.
-
కలెక్టర్ను కలిసిన నితిన్ కబ్రా
మెదక్: ప్రభుత్వ వైద్య కళాశాల నూతన ప్రిన్సిపాల్గా నితిన్ కబ్రా నియమితులయ్యారు. ఈసందర్భంగా ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కళాశాల అభివృద్ధికి కలెక్టర్ సలహాలు, సూచనలు పాటిస్తూ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.