ములుగు: వరదల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను కాపాడిన ఘటన తాడ్వాయి మండలం కాల్వపల్లిలో వెలుగుచూసింది. పశువుల కాపరి దుబారీ రామయ్య, చేపలు పట్టడానికి వెళ్లిన పి.సాయికిరణ్, రాజబాబు, రాములు వరదల్లో చిక్కుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం అర్ధరాత్రి గాలింపు చర్యలు చేపట్టింది. మంగళవారం ఉదయం సురక్షితంగా వారిని ఒడ్డుకు చేర్చారు.
Author: Shivaganesh
-
యూరియా కోసం రైతుల ధర్నా..
మహబూబాబాద్: నర్సింహులపేట మండల కేంద్రంలో మంగళవారం రైతులు యూరియా బస్తాల కోసం ధర్నా చేశారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తెల్లవారుజాము నుంచే యూరియా కోసం ఎదురు చూస్తున్న లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సరిపడా యూరియా సరఫరా చేయకడం లేదని వాపోయారు. వ్యవసాయ అధికారులు సర్దిచెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు.
-
భయాందోళనకు గురి చేస్తున్న వానర సేన..
మెదక్: నర్సాపూర్ పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీ 10వ వార్డులో కోతుల బెడద తీవ్రంగా మారిందని కాలనీవాసులు వాపోయారు. ఈసందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ.. వందలాది కోతులు రోజూ వీధుల్లోకి వచ్చి ప్రజలపై దాడులు చేస్తుండటంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు భయంతో బయటకు రాలేకపోతున్నారని అన్నారు. సమస్యపై మున్సిపాలిటీ అధికారులు వెంటనే దృష్టిసారించాలని కోరారు.
-
నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు..
మెదక్: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలిసిన నల్ల పోచమ్మ దేవాలయంలో శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా అమ్మవారికి పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. అమ్మవారికి నిమ్మకాయల మాలతో కుంకుమార్చన నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
-
కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
నిర్మల్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్ట్ లోకి 11,893 క్యూసెక్కుల భారీ వరద నీరు వచ్చి చేరుతుందని మంగళవారం ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కుడి, ఎడమ కాల్వకు, మిషన్ భగీరథకు 2 గేట్లను ఎత్తి మొత్తం 7,294 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 694.350 అడుగుల నీటి మట్టం ఉందన్నారు.
-
‘గణేష్ నవరాత్రులకు అనుమతి తప్పని సరి’
వరంగల్: ట్రై సిటీ పరిధిలో గణేష్ నవరాత్రులు నిర్వహించే వారు తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి పొందాలని పోలీస్ కమిషనర్ సన్ప్రిత్ సింగ్ తెలిపారు. ఆన్లైన్లో అనుమతి కోసం https://policeportal.tspolice.gov.in వెబ్సైట్లో మండపం వివరాలు, విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ, ప్రదేశం వంటి సమాచారంతో నమోదు చేసుకోవాలని సూచించారు. వినాయక మండపం నిర్వాహకులు తప్పని సరిగా ఈ నిబంధనలు పాటించాలన్నారు.
-
తెగిపోయిన సింగూరు ఎడమ కాల్వ
సంగారెడ్డి: సింగూరు ఎడమ కాల్వ మరోసారి తెగిపోయిన ఘటన పుల్కల్ మండలం మిన్పూర్ వద్ద వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం ఇసోజిపేట గ్రామ శివారులో కాల్వ తెగిపోగా, ఇప్పుడు మైసమ్మ చెరువులోకి వరద నీరు చేరడంతో తూము తెగిపోయింది. దీంతో వరద నీరు పొలాల్లోకి వెళ్లి పంటలను ముంచెత్తింది. ఈసందర్భంగా పలువురు అన్నదాతలు మాట్లాడుతూ.. ఈసమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు.
-
భారీ వర్షాలకు కూలిపోయిన ఇల్లు..
సంగారెడ్డి: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఒక పెంకుటిల్లు కూలిపోయిన ఘటన ఆందోల్ మండలం జోగిపేటలోని బాబా నగర్ కాలనీలో వెలుగుచూసింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటిపర్యంతం అయ్యారు.
-
జలదిగ్బంధంలో దుర్గాభవానీ ఆలయం
మెదక్: జిల్లాలోని ఏడు పాయల దుర్గాభవానీ ఆలయం ఆరు రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహించి ఆలయాన్ని వరద ప్రవాహంతో ముంచెత్తింది. వరద నీరు గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతోంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగిస్తున్నారు. వరద ఉద్ధృతి కారణంగా భక్తులకు ఆలయ సందర్శన నిలిపివేశారు.
-
నేడు జిల్లాలో విద్యాసంస్థలు బంద్..
ఆదిలాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే చర్యలు తప్పని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అవసరం అయితేనే బయటికి రావాలని అన్నారు.