జగిత్యాల: ధర్మపురి పట్టణంలోని తెనుగువాడలో ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను సోమవారం మున్సిపల్ ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్ బి.ఎస్.లత పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె లబ్ధిదారులను వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యం కాకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
ర్యాలీ నిర్వహించిన సీపీఎం నాయకులు
పెద్దపల్లి: గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో సోమవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య పాల్గొని మాట్లాడుతూ.. అమెరికా–ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై బాంబులు వేయడం అప్రజాస్వామికమన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిగ్రహం లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ర్యాలీలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
-
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
మెదక్: శివంపేట మండలం నవాబుపేట గ్రామానికి చెందిన మమత అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఆమె కుటుంబ సభ్యులు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేశారు. సోమవారం ఆమెకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.1.75 లక్షల ఎల్వోసీ పత్రాన్ని హైదరాబాద్లో ఎమ్మెల్యే సునీతారెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
-
పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
సంగారెడ్డి: పటాన్చెరులోని ముదిరాజ్ బస్తిలో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయం 5వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ ముదిరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
-
‘రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం’
సంగారెడ్డి: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్కుమార్ అన్నారు. 9 రోజుల్లో కోటి 49 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదల చేశామని తెలిపారు. ఎకరాకు రూ. 12 వేల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు భరోసా కల్పించామని పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
-
‘విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి’
సంగారెడ్డి: సదాశివపేట పట్టణ సీఐ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గంజాయి, కోకెన్, మద్యం, స్మోకింగ్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బంగ్లాభారతి, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
-
ప్రజావాణి అర్జీలు స్వీకరించిన కలెక్టర్
సంగారెడ్డి: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, తదితరులు పాల్గొన్నారు.
-
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
సంగారెడ్డి: మునిపల్లి మండల కేంద్రంలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పిల్లోడి సతీష్ పాల్గొని బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
డ్రగ్స్ నివారణపై అవగాహన
సంగారెడ్డి: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరం పాటుపడుదామని బీడీఎల్ బానూర్ సీఐ డి.స్వామి గౌడ్ పేర్కొన్నారు. పాటిలోని నారాయణ జూనియర్ బాలుర కాలేజీలో సోమవారం డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ వ్యతిరేక సైనికునిగా మారుతానని కాలేజీ సిబ్బంది, విద్యార్థులతో చేయించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
-
మంత్రి లక్ష్మణ్ను కలిసిన ఎమ్మెల్యే
పెద్దపల్లి: హైదరాబాద్లో సోమవారం మంత్రి లక్ష్మణ్ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భం ఆయన సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో మిగిలిన సీట్లు రామగుండం విద్యార్థులకు కేటాయించాలని మంత్రికి వినతి అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.