Author: Shivaganesh

  • ‘అనుమతి లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి’

    యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్‌లోని నారాయణ విద్యాసంస్థల్లో శనివారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అనుమతి లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, విద్యా హక్కు చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెలవుల్లో పాఠశాలలు నడుస్తున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ధర్నా చేసిన ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

  • ‘విద్యార్థులకు ఉచిత బస్ పాసులు కల్పించాలి’

    మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపోలో శనివారం సూపరిండెంట్‌ను పీడీఎస్‌యూ జిల్లా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పెంచిన బస్సు పాస్ ల ఫీజు తగ్గించాలని, విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ లు కల్పించాలని ఆర్టీసీ సూపరిండెంట్‌ను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, మధు, తదితరులు పాల్గొన్నారు.

  • వృద్ధురాలి గొలుసు చోరీ.. ఇద్దరి అరెస్ట్

    వరంగల్: వర్ధన్నపేటలో చైన్ స్నాచింగ్ కేసును శనివారం పోలీసులు ఛేదించారు. నల్లబెల్లి గ్రామానికి చెందిన పెరంబదూరు సుజాత(65) మెడలో రెండు తులాల బంగారు గొలుసును ఆమె ఆడబిడ్డ మనవరాలు రామాయణం హేమలత, ఆమె ప్రియుడు పడియాల రాము కలిసి దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే నేరానికి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

  • ‘హలాల్ చేసి బలివ్వడాన్ని నిషేధించాలి’

    మహబూబాబాద్: కురవి మండలంలోని ప్రసిద్ధ వీరభద్రస్వామి ఆలయంలో జంతువులను హలాల్ చేసి బలివ్వడాన్ని నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ (VHP) మానుకోట శాఖ విజ్ఞప్తి చేసింది. శనివారం సంఘం సభ్యులు మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని ఆలయ అధికారులను కోరినట్లు తెలిపారు. దానికి వారు సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

  • ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

    నిర్మల్: జిల్లా ప్రజలు జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకొని న్యాయ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె, జ్యూడిషియల్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ… న్యాయం కోసం కోర్టుల వద్ద వేచి చూసే అవసరం లేకుండా లోక్ అదాలత్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

     

  • దంపతులకు రాజీ కుదిర్చిన లోక్ అదాలత్

    సూర్యాపేట: తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. సివిల్ జడ్జ్ గౌస్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకున్నారు. తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన పర్వతం మధు, శ్రీవాణి దంపతులు లోక్ అదాలత్‌లో రాజీకీ వచ్చారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

  • చెరువులో పడి గేదెల కాపరి మృతి

    సూర్యాపేట: చెరువులో పడి గేదెల కాపరి మృతి చెందిన సంఘటన శనివారం కోదాడ మండలం దొరకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాతరాజు మైసయ్య (52) గేదెల కాపరిగా పని చేస్తున్నారు. రోజులాగానే పనికి వెళ్లిన ఆయన చెరువులో గేదెలను తోలి పైకి వస్తున్న క్రమంలో జారిపడి నీటిలో మునిగిపోయాడు. స్థానికులు గమనించి బయటకు తీయగా.. అప్పటికే మృతి చెందాడు.

  • ‘రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలి’

    మ‌హ‌బూబాబాద్: జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన నేష‌న‌ల్ లోక్ అదాల‌త్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కక్షిదారులు చిన్నచిన్న కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. క్షణికావేశంలో గొడవలు, ఘర్షణలకు దిగి అమూల్యమైన సమ‌యాన్ని వృథా చేసుకోకుండా, వాటిని రాజీమార్గంలో పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • ఆత్రం సుగుణక్కకు సన్మానం

    ఆదిలాబాద్: ఉట్నూర్ మండల కేంద్రంలోని సుగుణక్క నివాసంలో శనివారం ఆమెను కాంగ్రెస్ పార్టీ ఇచ్చోడ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయన సుగుణక్కను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఆత్రం సుగుణక్క నూతనంగా నియమితులైన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

  • ఉచిత కంటి వైద్య శిబిరం

    మహబూబాబాద్: లక్ష్మీపురం గ్రామంలో శనివారం సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాంకుడోత్ నవీన్ నాయక్ పాల్గొని శిబారాన్ని ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. 50 మందికి పరీక్షలు నిర్వహించి, వారిలో 12 మందిని ఆటోలో కంటి శాస్త్ర చికిత్స కోసం సూర్య హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు.