భద్రాద్రి కొత్తగూడెం: మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఓవ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన గురువారం ఆళ్లపల్లి మండలం భూసరాయిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రాజు (35) అనే వ్యక్తి మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో పలువురు గ్రామస్థులు ఆయనను కొట్టిచంపారు. స్థానికంగా ఉండే ఓమహిళ మరణానికి ఆయనే కారణమని అనుమానించి, ఆగ్రహంతో దాడికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసునమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Author: Shivaganesh
-
ఏం కష్టం వచ్చిందో.. బ్రిడ్జి పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య
ఆదిలాబాద్: యువకుడు శవమై కనిపించిన ఘటన గురువారం తలమడుగు మండలం సుంకిడిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన దాసరి ప్రశాంత్ (ఎర్రన్న) నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత గాలించిన దొరకలేదు. ఉదయం 7 గంటల సమయంలో సుంకిడి బ్రిడ్జి కింద ఆయన శవమై కనిపించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
కేయూ విద్యార్థులకు అలర్ట్..
హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్లకు శుక్రవారం నుంచి ఈనెల 18 వరకు సెలవులు ప్రకటించినట్లు హాస్టల్ డైరెక్టర్ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రెనోవేషన్ పనులు, హాస్టళ్ల రిపేర్ చేపట్టనున్న నేపథ్యంలో విద్యార్థులు తమ సామగ్రిని ఖాళీ చేయాలని సూచించారు. తిరిగి ఈనెల 15 నుంచి రెన్యువల్ చేసుకునే విద్యార్థులకే హాస్టల్, మెస్ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు.
-
‘కాంగ్రెస్ అవినీతిపై ప్రజలకు చైతన్యం’
వరంగల్: వర్ధన్నపేట మండలం కట్ర్యాల, కడారి గూడెం గ్రామాల్లో గురువారం “ఇంటింటికి బీజేపీ–ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు” కార్యక్రమం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి జడ సతీష్, ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అవినీతిపై ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా తమ పార్టీ ముందుకు నడుస్తుందన్నారు.
-
‘తల్లిపాల ఆవశ్యకతను తెలుసుకోవాలి’
ఆదిలాబాద్: తల్లిపాల వారోత్సవాల సందర్భంగా రిమ్స్ వైద్యులు, విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. పుట్టిన వెంటనే శిశువుకు తల్లి ముర్రుపాలు అందించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యతను వివరించి, బిడ్డకు అవి ఎంతో శ్రేయస్కారమని తెలిపారు. తల్లిపాల ఆవశ్యకతను అందరూ తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-
బస్ స్టాప్లో తాపీ మేస్త్రి మృతదేహం..
జనగామ: బస్స్టాప్లో తాపీమేస్త్రి మృతదేహం అనుమానాస్పదస్థితిలో లభ్యమైన ఘటన గురువారం జిల్లా కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన వెలుగుచూసింది. పెద్దపహాడ్ గ్రామానికి చెందిన తాళ్ల సిద్ధులు మృతదేహం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఉన్న బస్ స్టాప్లో అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-
నీటిసంపులో పడి రెండేళ్ల బాలుడు..
ఖమ్మం: నీటిసంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కవిత అనే వివాహిత తన ఇద్దరు పిల్లలకు స్నానం చేయిస్తున్న సమయంలో ఆడుకుంటూ రెండేళ్ల జయరామ్షి నాయక్ అనే బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
-
మార్కెట్కు మూడు రోజులు సెలవు.. రీఓపెన్ ఎప్పుడంటే
ఖమ్మం: జిల్లా రైతులకు ముఖ్యగమనిక.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణ శుక్రవారం, శని, ఆదివారాలు సెలవులని పేర్కొన్నారు. ఈ మూడు రోజులు మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. తిరిగి సోమవారం నుంచి మార్కెట్ యథావిధిగా పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. రైతులు గమనించి సహకరించాలని తెలిపారు.
-
వారికి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి..
మహబూబాబాద్: కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల నుంచి సిబ్బందికి ఆధార్ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ఈ నూతన విధానం సిబ్బంది పనితీరును మెరుగుపరచడం, హాజరు నమోదులో పారదర్శకతను పెంచడం లక్ష్యంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
-
దారుణం.. చిన్నారుల వీడియోలు
మంచిర్యాల: చిన్నారుల అసభ్యకరమైన వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన నస్పూర్ మండలంలో వెలుగుచూసింది. సైబర్ సెక్యూరిటీ విభాగం అధికారుల ఆదేశాల మేరకు తాళ్లపల్లి పునరావాసకాలనీకి చెందిన కర్ర సందీప్ ఇన్స్టాగ్రామ్లో చిన్నారుల అసభ్యకరమైన వీడియోలను పోస్ట్ చేస్తున్నట్లు గుర్తించి, అరెస్ట్ చేసినట్లు సీఐ ఆకుల అశోక్ తెలిపారు.