Locations: Hyderabad

  • రూ.11కోట్ల విలువైన కెమికల్ డ్రగ్స్‌.. మహారాష్ట్రకు తరలింపు

    మేడ్చల్: చర్లపల్లిలో ఇటీవల బయటపడ్డ డ్రగ్స్ తయారీ యూనిట్‌కు సంబంధించి మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వాగ్దేవి లాబరేటరీలో సీజ్ చేసిన సుమారు రూ.11కోట్ల విలువైన కెమికల్ డ్రగ్స్‌ను లారీలో మహారాష్ట్రకు తరలించారు. సుమారు 30 వేల లీటర్ల కెమికల్ డ్రమ్ములను పంచనామా పూర్తి చేసి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులను పట్టుకోవడానికి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

  • HYDలో పెరిగిన కాలుష్యం

    గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 83 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, వాటిలో 15% (1.2 లక్షలు) పదిహేనేళ్లకు పైబడినవే. ఈ కాలం చెల్లిన వాహనాల వల్ల పీఎం 2.5 ఉద్గారాలు అధికంగా వెలువడుతున్నాయి. గ్రేటర్‌లో 350 కాలుష్య తనిఖీ కేంద్రాలున్నా, చాలా చోట్ల వాహనాలను తనిఖీ చేయకుండానే డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు ఇస్తున్నారని తెలుస్తోంది. అర్బన్‌ ఎమిషన్స్‌ గ్రూప్‌ నివేదిక ప్రకారం.. ఏటా 8,250 టన్నుల పీఎం 2.5 ఉద్గారాలు విడుదల అవుతున్నాయి.

  • త్వరలో ఓల్డ్ సిటీ మెట్రో కల సాకారం

    హైదరాబాద్‌ పాతబస్తీ మెట్రోరైలు పనులు ప్రారంభానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. మెట్రో కారిడార్‌ కోసం రహదారిని 100 అడుగుల మేర విస్తరిస్తున్నారు. ఇందుకోసం రోడ్డుకు అడ్డుగా ఉన్న భవనాలను కూల్చివేస్తున్నారు. పాతనగరం మెట్రో రైలు ప్రాజెక్ట్‌ పనులు త్వరలో ప్రారంభమవుతాయని హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

     

  • హైదరాబాద్‌కు ‘అమ్మ వస్తోంది’.. వీడియో వైరల్

    HYD: వినాయక నిమజ్జనం తర్వాత హైదరాబాద్‌లో దసరా సందడి మొదలైంది. ‘గణేశుడు వెళ్లాడు.. అమ్మ వస్తోంది’ అంటూ నగర యువత రూపొందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘రాంనగర్ కా మాతా రాణి’ శరన్నవరాత్రుల సందర్భంగా రూపొందించిన ఈ వీడియో భక్తులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

  • HYDలో అక్రమంగా ఉంటున్న విదేశీయులు

    హైదరాబాద్‌లో సుమారు 5 నుంచి 6 వేల మంది విదేశీయులు అక్రమంగా మకాం వేసినట్లు అంచనా. వీరంతా తమ వీసాల గడువు ముగిసినా తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారు. అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి మాదకద్రవ్యాల సరఫరా, వ్యభిచారం, సైబర్ నేరాల వంటి చీకటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వీరు విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడి, డబ్బుకోసం దేనికైనా తెగిస్తున్నారు. ఈ అక్రమ కార్యకలాపాలు నగర భద్రతకు సవాలుగా మారాయి.

  • ఉద్యోగం లేదని యువకుడి ఆత్మహత్య

    మేడ్చల్: ఉద్యోగం లేకపోవడంతో నిరాశకు గురైన అహ్మద్‌ ఫహీమీ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఝార్ఖండ్‌కు చెందిన ఇతను హైదరాబాద్‌ పోచారం ఐటీకారిడార్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. దుబాయ్‌లో రెండేళ్లు పనిచేసి, ఉపాధి లేక జనవరిలో తిరిగి వచ్చాడు. తన గదిలో శీతలపానీయంలో పురుగుమందు కలుపుకుని తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • ఐదు ప్రమాదాలు.. ఆరు ప్రాణాలు

    HYD: గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో జరిగిన ఐదు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. లంగర్‌హౌస్‌ వంతెనపై కారుప్రమాదంలో కాశ్వీ విజయవర్గీ(20) మృతి చెందగా, బషీర్‌బాగ్‌లో వినాయక విగ్రహ వాహనం కిందపడి పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక (50) చనిపోయింది. ఉస్మానియా ఆసుపత్రి వద్ద బైకుప్రమాదంలో సయ్యద్‌ జకీ, తలకొండపల్లిలో లారీప్రమాదంలో మహేశ్‌, మదనపల్లిలో బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అఖిల్, చింటూ మరణించారు.

  • గణేశ్‌ నిమజ్జనం.. జలాశయాల్లో పెరిగిన కాలుష్యం

    HYD: గణేశ్‌ నిమజ్జనం తర్వాత పీవోపీ విగ్రహాల వల్ల జలాశయాల్లో కాలుష్యం పెరిగిందని పీసీబీ నిపుణులు తెలిపారు. టన్నుల కొద్దీ ఘన వ్యర్థాలు, రసాయనాలు నీటిలో కలిశాయని చెప్పారు. దీనిపై ఇప్పటికే మూడు దశల్లో నీటి నమూనాలను సేకరించిన అధికారులు త్వరలో కాలుష్యంపై పూర్తి నివేదికను విడుదల చేయనున్నారు. ఈ కాలుష్యం జలచరాలకు, పర్యావరణానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు.

  • ఘనంగా గణపతి నిమజ్జన మహోత్సవాలు..

    HYD: మహానగరంలో గణేశ్‌ నిమజ్జన ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. హుస్సేన్‌సాగర్‌తో పాటు 100కి పైగా జలాశయాల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో వేడుక ప్రశాంతంగా సాగింది. 40 గంటల పాటు అప్రమత్తంగా బందోబస్తు నిర్వహించిన పోలీసులను నగర సీపీ సీవీ ఆనంద్‌ అభినందించారు. మొత్తం ప్రక్రియ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముగియడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

  • మాదాపూర్ ఎస్సీ వెల్ఫేర్ లడ్డు వేలం!

    HYD: మాదాపూర్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వినాయకుడి లడ్డూకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడగా ఈరన్ సాయి కుమార్  లడ్డూ ప్రసాదాన్నిరూ.5లక్షల 15వేలకు సొంతం చేసుకున్నారు. మరోవైపు దేవుడి కలశం రికార్డ్ స్థాయి ధర పలికింది. లక్ష 20 వేలకు ఈరన్ జ్ఞానేశ్వర్ దక్కించుకున్నారు. లడ్డూ వేలం పాటను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.