HYD : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A2గా ఉన్న IAS అధికారి అరవింద్ కుమార్ ACB ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మూడోసారి ఏసీబీ విచారణకు ఆయన వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని ACB గుర్తించింది. HMDA డైరెక్టర్గా పని చేస్తూ నిధులను మళ్లించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
Locations: Hyderabad
-
శంషాబాద్ ఎయిర్పోర్టులో మూడు విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్
HYD: శంషాబాద్ ఎయిర్పోర్టులో మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. ముంబైలో వాతావరణం సరిగా లేని కారణంగా ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన ఢిల్లీ-ముంబై, చెన్నై-ముంబై, లక్నో-ముంబై విమానాలను శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
-
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. కాప్రాలో వినతిపత్రం
మేడ్చల్: జూలై 9న దేశవ్యాప్త సమ్మె కారణంగా కాప్రా సర్కిల్లో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కావడంలేదని తెలిపే వినతిపత్రాన్ని కాప్రా బీఆర్టీయూ అధ్యక్షుడు కురుమన్న, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సమర్పించారు. డిప్యూటీ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో.. ఏఎంహెచ్ఓ మధుసూదన్ రావు, ఎస్ఎస్ సుదర్శన్లకు వినతిపత్రం అందజేశారు.
-
‘సమస్యలపై పోరాడే అవకాశం కల్పించాలి’
మేడ్చల్: మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆదేశాలతో వినాయక్ నగర్ డివిజన్లోని నిరుపేదుడైన మోహన్ కుటుంబానికి సహాయం అందించారు. కాళ్లు విరిగి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మోహన్కు రూ.15 వేలు విలువైన రెండు నెలల నిత్యావసర సరుకులు అందజేశారు. నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ప్రజా సమస్యలపై పోరాడే అవకాశం కల్పించాలని హనుమంతరావు కోరారు. -
ఫ్రిజ్ పేలి అగ్నిప్రమాదం.. తలసాని ఆర్థిక సహాయం
HYD: సనత్ నగర్ రాజరాజేశ్వరి నగర్లో ఓ ఇంట్లో ఫ్రిజ్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రాణనష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధితులను పరామర్శించి, తక్షణ ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు.
-
‘మౌలిక వసతులు కల్పించాలి’
HYD: సంతోష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సాయి నగర్లోని కార్పొరేటర్ సునీత యాదవ్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకుడు మేకల రాము యాదవ్కు వినతిపత్రం సమర్పించారు. సంతోష్నగర్ కాలనీలో మంచినీటి సమస్య నివారణకు పవర్ బోరు, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు బ్రహ్మయ్య, రాము, కిట్టు, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. -
‘రోజుకు 24 గంటలు పనిచేయాలి’
HYD: నగరంలో పనిచేసే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు 24 గంటలు షిఫ్టుల వారీగా అందుబాటులో ఉంటూ.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తుతుందో, దానికి పరిష్కారం ఏమిటో తెలిసి ఉండాలని పేర్కొన్నారు. వరద నీరు రహదారులు, నివాసాలను ముంచెత్తకుండా జాగ్రత్త పడాలన్నారు.
-
ఇందిరా క్యాంటీన్ స్థాపనకు కార్పొరేటర్ సర్వే
మేడ్చల్: చర్లపల్లి డివిజన్లో ఇందిరా క్యాంటీన్ స్థాపన కోసం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అధికారులతో కలిసి ప్రాంత పరిశీలన నిర్వహించారు. కుషాయిగూడ ఆటో, బస్టాండ్, చక్రిపురం చౌరస్తా, ఐజీ కాలనీ, చర్లపల్లి పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ సర్వే చేశారు. ఈ కార్యక్రమంలో సీపీ కృష్ణమోహన్, ఏఏంఓ హెచ్ మధుసూదన్, శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్,తదితరులు పాల్గొన్నారు.
-
‘కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించండి’
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల ఫస్ట్ అవెన్యూ కాలనీవాసులు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధుల కోసం మల్కాజిగిరీ ఎంపీ ఈటల రాజేందర్ను కలిశారు. 200 గజాల ఖాళీ స్థలంలో హాల్ నిర్మాణం కోసం వినతిపత్రం అందజేశారు. కాలనీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమాలు, వృద్ధుల అవసరాలకు హాల్ అవసరమన్నారు.ఎంపీ సానుకూలంగా స్పందించారని, నిధుల కేటాయింపుకు కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
-
కార్పొరేట్ కళాశాలల అధిక ఫీజులు.. తల్లిదండ్రుల ఆవేదన
HYD: కోటి బడే చౌడిలోని అవినాష్ కళాశాలలో రెండు రోజుల ఆలస్యం పేరిట రూ.3వేలు అధిక ఫీజు వసూలు చేయడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో ఫీజులు కట్టినా,లేట్ఫీస్ పేరుతో డబ్బులు వసూలు చేయడంపై ప్రశ్నిస్తున్నారు.విద్యాశాఖ అధికారులు అక్రమాలను పట్టించుకోకపోవడంతో మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక భారం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.