HYD: విజయనగర్ కాలనీ శాంతి నగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో డివిజన్ కార్పొరేటర్ ఖాసీం పాల్గొన్నారు. స్థానికులు వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించిన ఖాసీం వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ కుటుంబాలు నివసించే ఈ ప్రతిష్ఠాత్మక కాలనీ అభివృద్ధికి అన్ని చర్యలు చేపడతానని తెలిపారు.
Locations: Hyderabad
-
శ్రీ పోచమ్మ తల్లి ఆలయ భూమి పూజ
మేడ్చల్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ ధరణి కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఘనంగా జరిగింది. ఈ ఏడాది బోనాల పండుగలోపు ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భక్తి శ్రద్ధలతో శంకుస్థాపన జరిగింది.
-
ఛానెల్పై దాడి.. కార్యాలయాన్ని పరిశీలించిన నేతలు
TG: మహాన్యూస్ టీవీ ఛానెల్పై దాడి ఘటన నేపథ్యంలో.. ఛానెల్ కార్యాలయాన్ని వివిధ పార్టీల నేతలు సందర్శించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీపీఐ నేత నారాయణ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తోపాటు BJP నేతలు సందర్శించారు. దాడి ఘటనలో ఛానెల్ కార్యాలయంలో ధ్వంసమైన ఫర్నిచర్, కిటికీలు, కార్లను నేతలు పరిశీలించారు.
-
ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించిన మాజీ ఛైర్పర్సన్
మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఉర్దూ మీడియం పాఠశాలను మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ సందర్శించారు. విద్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలని ఆమె కోరారు. ఈ పాఠశాలను ముస్లిం సోదరులు, చుట్టుప్రక్కల గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బర్ల దేవేందర్ ముదిరాజ్, ఫరూక్, శాశ బేగం, తదితరులు పాల్గొన్నారు.
-
మహా న్యూస్ ఛానెల్ను పరిశీలించిన మంత్రి
TG: హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానెల్పై BRS దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఛానెల్ ఎండి వంశీ కృష్ణతో మాట్లాడి దాడి వివరాలను ఆరా తీశారు. ఈ దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించిన మంత్రి.. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మీడియాకు అండగా ఉంటుందన్నారు.
-
స్మశాన వాటికలో బోర్వెల్, సీసీ రోడ్డు ప్రారంభం
మేడ్చల్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 21వ డివిజన్లోని సాయి నగర్ స్మశాన వాటికలో నీటి కొరత, పాదచారుల ఇబ్బందులను కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కోలన్ హన్మంత్ రెడ్డి అధికారులతో చర్చించి, మున్సిపల్ నిధుల ద్వారా నూతన బోర్వెల్, సీసీ రోడ్డు మంజూరు చేయించారు. NMC అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. బస్తీవాసులు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.
-
పీజేఆర్ ప్లైఓవర్.. వీరి ప్రయాణం సులభం!
TG: హైదరాబాద్ ఐటీ కారిడార్లోని వాహనదారులకు ఊరట కల్పించేందుకు పీజేఆర్ ప్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లైఓవర్ వల్ల ఔటర్ రింగు రోడ్డు నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాలకు వెళ్లే వాహనాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. కొండాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఈ ఫ్లైఓవర్ మరింత అనుకూలంగా ఉంటుంది.
-
పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
TG: హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ 1.2 కి.మీ. పొడవైన, ఆరు లేన్ల ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ఐటీ కారిడార్కు మెరుగైన కనెక్టివిటీ అందిస్తుంది. రూ.182.72 కోట్లతో నిర్మితమైన ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్ రవాణా వ్యవస్థలో కీలకమైన అడుగు అని అధికారులు చెబుతున్నారు.
-
ఈ ఆలోచన మంచిది కాదు: సీఎం చంద్రబాబు
హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీసుపై దాడిని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. ‘‘ప్రముఖ మీడియా ఛానల్ మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాను’’ అని సీఎం పేర్కొన్నారు.
-
‘విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి’
HYD: సైదాబాద్లోని వికాస భారతి హై స్కూల్ విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం సైదాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగింది. డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ పాల్గొని డ్రగ్స్ రహిత సమాజం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, విక్రయించే వారి సమాచారం పోలీసులకు తెలియజేయాలన్నారు.