Locations: Hyderabad

  • పెళ్లి పేరుతో బాలికపై లైంగికదాడి.. పోక్సో కేసు నమోదు

    HYD: పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలిక(17)పై లైంగికదాడికి పాల్పడిన సునీల్‌ యాదవ్‌(21)పై బంజారాహిల్స్‌ పోలీసులు పోక్సోకేసు నమోదు చేశారు. బీహార్ నుంచి వచ్చి గచ్చిబౌలిలో నివసిస్తున్న సునీల్‌, ఏడాదిగా బాలికను మాయమాటలతో లోబర్చుకొని, స్నేహితుడి గదికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో యువతితో సంబంధం ఉన్నట్లు తెలిసి బాధితురాలు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు.

  • చైన్ స్నాచింగ్స్, దొంగతనాల కేసులను ఛేదించిన పోలీసులు

    HYD: సికింద్రాబాద్ రైల్వే పోలీసులు 4 చైన్ స్నాచింగ్స్, 2 దొంగతనాల కేసులను ఛేదించారు. కొత్తగూడెం నుంచి తంబళ్ల నితిన్, నిజామాబాద్ నుంచి ఇందిరాల రాజేశ్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.11.45లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్లుగా పనిచేస్తూ గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్, చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేశారని డీఎస్పీ ఎస్ఎన్‌.జావేద్ వెల్లడించారు.

  • నకిలీ ఏసీ వైర్లపై టాస్క్ ఫోర్స్ రైడ్స్

    HYD: కోఠి ట్రూప్ బజార్‌లోని ఎలక్ట్రికల్ వైర్స్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ ప్రమాదానికి నకిలీ ఏసీ వైర్లు కారణమని నివేదిక రావడంతో ఈ చర్యలు చేపట్టారు. గోల్డ్ మెడల్ కంపెనీ పేరిట నకిలీ వైర్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి, రెండు షాపులలో నకిలీ వైర్లను సీజ్ చేశారు. 

  • ఏఆర్ ఆధారిత ఓపీడీ సేవలు..

    HYD: ప్రపంచంలోనే మొట్ట మొదటి ఏఆర్ ఆధారిత ఓపీడీ సేవలు కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో అందుబాటులోకి వచ్చాయని హాస్పిటల్ ఎండీ డా. గురువా రెడ్డి తెలిపారు. బేగంపేటలోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఆర్ ఆధారిత ఓపీడీ సేవలను గురించి వైద్యులకు వివరించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఆధారిత ప్రిస్క్రిప్షన్ ఓపీడీలో రోగి విద్య కోసం ఏఆర్ టెక్నాలజీతో హాస్పిటల్‌లో ప్రవేశ పెట్టినట్లు పేర్కొన్నారు.

  • నోరున్న కార్పొరేటర్లకే నిధులిచ్చే పద్ధతి మారాలి: ఎంపీ

    హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం వాడీవేడిగా కొనసాగుతోంది. నగరంలో సమస్యలపై కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు, అధికారులంతా కలిసి చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో వీధదీపాలు,  ట్రాఫిక్‌ ఇబ్బందులు పలు అంశాలపై ప్రశ్నలు, సమాధానాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. నోరున్న కార్పొరేటర్లకే నిధులిచ్చే పద్ధతికాకుండా.. పార్టీలతో సంబంధం లేకుండా సమస్యలు ఉన్న అన్ని ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు.

  • ‘ఇక్కడి వారికి అవకాశం ఇవ్వడం లేదు’

    హైదరాబాద్: కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల పెత్తందారుల జులం ఏంటని తెలంగాణ లోకల్ క్యాబ్‌వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగి మల్లేష్ అన్నారు. బోరబండలో మీడియా సమావేశం నిర్వహించారు. హైటెక్ సిటీలో క్యాబ్‌వేండర్స్‌గా ఇతర రాష్ట్రాల వారికి అవకాశాలు ఇస్తూ.. ఇక్కడి వారికి అవకాశం ఇవ్వడంలేదని వాపోయారు. సమస్యలు తీరాలంటే  అసోసియేషన్ ఉండాలని దాదాపు 100 మందితో కూడిన అసోసియేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు.

  • హెల్త్‌క్యాంపులో పాల్గొన్న ఎమ్మెల్యే

    HYD: బిగ్ టీవీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకురాలు సీ. వైష్ణవీ యాదవ్, మెడికవర్, మాక్సివిజన్ సహకారంతో మోండా మార్కెట్ డివిజన్ అంబేద్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మెగా హెల్త్‌క్యాంపులో ముఖ్యఅతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరై ప్రారంభించారు. హెల్త్‌క్యాంప్ ఏర్పాటు చేసిన బిగ్ టీవీ యజమాన్యానికి అభినందనలు తెలిపారు. వార్తా ప్రసారాలతో పాటు హెల్త్‌క్యాంపులు చేస్తూ ప్రజలకు సాయం చేయడంపై సంతోషం వ్యక్తంచేశారు.

  • ఘట్కేసర్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు..

    మేడ్చల్: ఘట్కేసర్ పీఎస్ పరిధిలో బుధవారం బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో సీఐ పందిరి పరుశురామ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, దేవాలయం, మసీద్ , ఆర్టీసీ బసెస్, జన సమూహం కలిగినా షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది తనిఖీలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

  • బిల్డింగ్‌పై నుంచి పడి వ్యక్తి మృతి..

    రంగారెడ్డి: మద్యం మత్తులో ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అత్తాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. శివరాం పల్లిలో ఉండే అమిత్‌కుమార్ మద్యం సేవించి తన ఇంటికి రాగా ఒకటోంతస్తు నుంచి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్రగాయం కాగా స్థానికులు హాస్పటల్‌కు తరలించే లోపు మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టారు.

  • బ్యాగ్‌‌లో కుళ్లిన మహిళ మృతదేహం

    మేడ్చల్: బాచుపల్లి పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ గోడ దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో దుర్వాసన వెదజల్లుతున్న బ్యాగ్‌ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తెరిచి చూడగా.. కుళ్లిన స్థితిలో ఉన్న గుర్తుతెలియని మహిళ (25) మృతదేహం లభ్యమైంది. బాలనగర్ డీసీపీ సూచనలతో హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.